– డ్వామా ఏపీడీ జె.రామనాధం
ఘంటసాల: ఉపాధి హామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం వహించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని డ్వామా ఏపీడీ జె.రామనాథం అన్నారు. ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో ఏపీడీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఘంటసాల మండలానికి 7300 పనిదినాలకు గాను ఇప్పటి వరకు 4600 మాత్రమే చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పని దినాల్లో వెనుకబడి ఉన్న మల్లంపల్లి, చిట్టూర్పు, పాపవినాశనం, కొత్తపల్లి, దేవరకోట, అచ్చెంపాలెం, దాలిపర్రు ఎఫ్ఏలను ప్రశ్నించడంతో పాటు సకాలంలో ఎఫ్ఏల పని దినాల టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పంచాయతీల్లో చెరువులను గుర్తించి ఎండగట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్వచ్ఛరథం, స్వచ్ఛ పథం, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శులతో చర్చించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఘంటసాల మండలానికి విచ్చేసిన డ్వామా ఏపీడీ, ఇన్చార్జి డీఎల్డీవో జె.రామనాథంను ఎంపీడీవో డి.సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీవోలు కె.వెంకటేశ్వరరావు, వై.శివరామ ప్రసాద్, ఏపీవో రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర సమితి డిమాండ్ చేసింది. హనుమాన్పేటలోని దాసరి భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ బండి సంజయ్ తనయుడు భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారిందన్నారు. నిందితుడు భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి అరెస్ట్లో జాప్యం జరుగుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకునేందుకు బాధితురాలిపైనే తిరిగి కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించి నిందితుడికి శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బంక ఝాన్సీ, దుర్గాసి రమణమ్మ, నాగూర్ బి.అనిత, మురళి తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా విశాఖపట్నం–నిజాముద్దిన్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–నిజాముద్దిన్ (08513) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 5.40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11.40 గంటలకు నిజాముద్దిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08514) ఈ నెల 24న ఆదివారం రాత్రి 11.55 గంటలకు నిజాముద్దిన్లో బయలుదేరి, మంగళవారం రాత్రి 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బల్హార్ష, నాగ్పూర్, రాణికమలాపాటి, ఝాన్సీ, ఆగ్రా తదితర స్టేషన్లలో ఆగుతుంది.


