డీఈవో వైవీ సుబ్బారావు
పెడన: ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యాకిట్లను పంపిణీ చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వైవీ సుబ్బారావు తెలిపారు. పెడనలోని భట్టా జ్ఞానకోటయ్య జెడ్పీహెచ్ఎస్లో బుధవారం ఆయన పెడన మండలానికి సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్ క్లాత్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీ ఇస్తామన్నారు. పెడన మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 3,538 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కిట్లను రిసీవ్ చేసుకోవడం, జాగ్రత్తగా భద్రపరచడం, ప్రతి ఒక్క విద్యార్థికి సజావుగా కిట్లను అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. కిట్ల నాణ్యతను పరిశీలించి యాప్లో నమోదు చేసిన పిమ్మట విద్యార్థులకు ఇవ్వాలని స్పష్టం చేశారు.


