మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆడటం వల్ల ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక గణదలలోని నెక్ట్స్జెన్ సీబీఎస్ఈ స్కూల్ ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా అండర్–15 బాల బాలికల చెస్ టోర్నమెంట్ మంగళవారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 46 మంది బాలబాలికలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. మొత్తం ఆరు రౌండ్లలో జరిగిన పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో వి.హేమంత్కుమార్, ఏ.శశాంక్, డి. రోషన్, అమోల్ దాస్, బాలికల విభాగంలో ఎస్.శ్రీమహి, కె.ఆధ్య, కె.సాయివీక్షణ, సౌమిక చౌదరి విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి అక్బర్ పాషా హాజరై విజేతలకు బహుమతులు, ప్రశంశాపత్రాలను అందజేశారు. ఆ టోర్నీలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జూన్ 13, 14 తేదీల్లో కృష్ణాజిల్లాలోని గుడివాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ అండర్–15 చెస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. నెక్ట్స్జెన్ సీబీఎస్ఈ స్కూల్ ప్రతినిధులు గౌతమి, ఎం.సుధా, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి పి. రేణుక, చీఫ్ ఆర్బిటర్స్ పి.రవీంధ్ర, ఏ.మణి రత్నంతో పాటుగా క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


