పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారత దేశ ఆర్థిక వనరులపై చమురు దిగుమతులు ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్పీసీఎల్ జీఎం, చమురు పరిశ్రమ ఏపీ సమన్వయకర్త ఎన్.భాస్కరరెడ్డి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘సంరక్షణ క్షమత మహోత్సవం’ (సక్షం–2026) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ఆయిల్ అండ్ గ్యాస్ను కాపాడండి.. గ్రీన్ ఎనర్జీని స్వీకరించండి’ అనే ట్యాగ్ లైన్తో ఈ నెల 15వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సైక్లోథాన్, వాక్థాన్, సీఎన్జీ ఆటో/కార్ ర్యాలీ, ఎల్పీజీ డెలివరీ బాయ్స్ శిక్షణ, గృహిణులు, విద్యార్థులకు ఇంధన ఆదా చిట్కాలు ఉంటాయని చెప్పారు. ఐఓసీఎల్ విజయవాడ డివిజనల్ ఎల్పీజీ సేల్స్ హెడ్ టి. రావు మాట్లాడుతూ పౌరులు ఇంధన వినియోగాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడాలని సూచించారు. బీపీసీఎల్ – ఎల్పీజీ విజయవాడ టెరిటరీ మేనేజర్ సీటీ వేణుగోపాల్, హెచ్పీసీఎల్–ఎల్పీజీ విజయవాడ రీజియన్ డీజీఎం పంకజ్ ఎస్ చౌదరి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎం కె.ఎస్.తివారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, ఇంధన పరిరక్షణ థీమ్ ఆధారిత సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు బహూకరించారు.
చమురు పరిశ్రమ ఏపీ సమన్వయకర్త భాస్కరరెడ్డి


