
ఈ–క్రాప్ వర్రీ!
జిల్లాలో 3.77 లక్షల ఎకరాల్లో పంటల సాగు 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ–క్రాప్ పూర్తి నెలాఖరుతో పూర్తికానున్న గడువు సాంకేతిక సమస్యలు, వర్షాలే కారణమంటున్న అధికారులు రానున్నది తుపానుల కాలం కావడంతో అన్నదాతల్లో ఆందోళన
పంటల నమోదులో తీవ్ర జాప్యం
కంకిపాడు: ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోంది. గడువు ముగింపు సమయం దగ్గర పడుతున్నా, లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. సాంకేతిక సమస్యలు, వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో పంట పొలాల్లోకి వెళ్లటానికి ఆస్కారం లేకపోవటంతో ఈ–క్రాప్ నమోదు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. దీనికి తోడు వ్యవసాయ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయం కొరవడటం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
కృష్ణాజిల్లా వ్యాప్తంగా 4,14,305 ఎకరాల్లో సాగుభూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ వ్యవసాయ పంటలు 3,49,660 ఎకరాల్లో సాగు పూర్తి కాగా, ఉద్యాన పంటలు 27,888 ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. ప్రధానంగా వరి, చెరకు, పసుపు, కంద, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే..
ఈ–క్రాప్ నమోదు పూర్తికావటం వల్ల ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు రైతులకు లబ్ధి చేకూరుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత రైతాంగాన్ని తక్షణమే గుర్తించి పరిహారం అందించటంలో ఇబ్బందులు తొలగుతాయి. పంట ఉత్పత్తులు చేతికి అందిన తర్వాత మార్కెట్లో విక్రయించుకోవటానికి, మద్దతు ధర పొందటానికి ఆస్కారం ఉంటుంది.
లక్ష్యాన్ని చేరని నమోదు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. అయినా నేటికీ ఈ–క్రాప్ నమోదు పూర్తి కాలేదు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3,77,549 ఎకరాల్లో పంటలు సాగు జరుగుతుండగా, 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ–క్రాప్ పూర్తయ్యింది. ఇంకా 65 శాతానికి పైగా భూములకు ఈ–క్రాప్ నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు.
శాఖల మధ్య సమన్వయం లోపం..
ఈ–క్రాప్ నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి పూర్తిగా ధ్రువీకరణ చేసిన తరువాతే ఈ–క్రాప్ పూర్తి చేయాలి. కానీ ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ శాఖ ఈ–క్రాప్ నమోదుకు పూర్తిగా దూరంగా ఉంటోంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది మాత్రమే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. దీని వల్ల ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అడుగడుగునా అవరోధాలు..
ఈ–క్రాప్ నమోదులో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో పంట పొలాల్లోకి సిబ్బంది వెళ్లలేని పరిస్థితి. దీనికి తోడు కృష్ణానది ఏటిపాయలకు వరదనీరు చేరటంతో లంక భూముల్లోకి రాకపోకలు లేవు. దీంతో ఏటిపాయలోని లంక గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్లి ఈ–క్రాప్ నమోదు పూర్తి చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు కూడా వెంటాడు తున్నాయి. సర్వర్ పనిచేయక ఈ–క్రాప్ నమోదులో జాప్యం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. తాజాగా నెలకొన్న యూరియా కొరత, పంపిణీలో తలెత్తుతున్న సమస్యలతో ఎక్కువ భాగం సిబ్బంది యూరియా పంపిణీపై దృష్టి సారించటంతో ఈ–క్రాప్ ముందుకు సాగటం లేదు.
వేగవంతం చేస్తాం..
ఈ–క్రాప్ నమోదు వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ–క్రాప్ నమోదును పూర్తి చేస్తున్నారు. ఇటీవల వర్షాలు వల్ల పంట పొలాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం యూరియా సమస్య పరిష్కారంపై దృష్టి సారించాం. సమస్య తీరగానే ఈ– క్రాప్పై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుతాం.
– ఎన్.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి

ఈ–క్రాప్ వర్రీ!