
దేవస్థానంలో ఈ ప్రొక్యూర్ మెంట్ సీల్డ్ టెండర్లు ఖరారు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో వివిధ కేటగిరీల్లో లైసెన్సు హక్కులకు ఈ –ప్రొక్యూర్మెంట్, బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సుధాకరరావు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో బుధవారం ఉదయం వేలం నిర్వహించినట్లు డీసీ తెలిపారు. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలు ప్రోగుచేసుకునే హక్కుకు రెండేళ్ల కాల పరిమితికి నవంబర్ 6, 2025 నుంచి నవంబర్ 5, 2027 వరకు రెండో సంవత్సరం 10 శాతం పెంపుదలతో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన లక్ష్మీ రమాదేవి ఎంటర్ప్రెజెస్వారు రూ.60.60 లక్షలకు లైసెన్సు హక్కు పొందారన్నారు. లడ్డూ ప్రసాదం తయారు చేయుటకు నవంబర్ 1, 2025 నుంచి అక్టోబర్ 31, 2026 ఏడాదిన్నర కాలానికి ఆకులమన్నాడు గ్రామస్తుడు పువ్వాడ వంశీ లైసెన్సు పొందారు.
ఆలయ అధికారుల సమక్షంలో ఖరారు..
పులిహోర ప్రసాదం తయారు చేసి, ప్యాకింగ్ చేయుటకు వక్కలగడ్డ వాసి కర్ర లక్ష్మి, కూరగాయల సరఫరాకు విశ్వనాథపల్లి వాసి రేపల్లె పిచ్చేశ్వరరావు లైసెన్సు పొందారు. అరటి పండ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు సరఫరా, రాతి నాగశిలలు సరఫరాకు మచిలీపట్నం వాసి ఉప్పాల సుబ్రహ్మణ్యం లైసెన్సు పొందారు. ఖాళీ నెయ్యి డబ్బాలు, పాత ఐరన్ రద్దు కొనుగోలు చేయుటకు విజయవాడ వాసి అనుమూల శ్రీనివాసరెడ్డి, సర్పదోష నివారణ పూజలకు కావాల్సిన వెండి పూత నాగపడగలు సరఫరాకు గుడివాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్, ఆవు పెరుగు సరఫరా చేసేందుకు మోపిదేవికి చెందిన వీఏవీల్వీకే గుప్తాకు లైసెన్సు పొందారన్నారు. ఆలయ సూపరింటెండెంట్స్ అచ్యుత మధుసూదనరావు, బొప్పన సత్యనారాయణ, చెన్నకేశవ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.