
ఏడుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆర్పేట పోలీస్స్టేషన్లో ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంలోని ఓగీసుపేటకు చెందిన భూపతి వినూతన్సాయి, యర్రంశెట్టి కేశవనాగకుమార్, ఈడేపల్లికి చెందిన జోగి సాయిశ్రీనివాస్, రుస్తుంబాదకు చెందిన మల్లిపూడి వినయ్, పుప్పాల స్వామి, వెన్న అనిల్కుమార్, సుకర్లాబాదకు చెందిన చిట్టిబొమ్మ గీతకృష్ణ అనే యువకులు ఈ నెల 28వ తేదీన ఇటుకబట్టీల వద్ద గంజాయి తాగుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్పార్టీ పోలీసులు రైడ్ చేసి పై ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభించింది. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నగరంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారికి సరఫరా చేస్తున్న పలువురు పేర్లను పోలీసులకు చెప్పారు. దీంతో పట్టుబడిన ఏడుగురిపై గంజాయి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. పట్టుబడిన వారికి సరుకు సరఫరా చేస్తున్న మరికొంత మందిని తర్వలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఇనగుదురుపేట, ఆర్పేట పోలీసులు, స్పెషల్పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.