
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమిద్దాం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వాటి పరిరక్షణకు ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతుందని, సున్నా నమోదు పాఠశాలలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగనున్నాయన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు మాట్లాడుతూ అమలులో ఉన్న స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం రాష్ట్రమంతటా ఏకరీతిలో పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాలు తయారు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వి. సాంబశివరావు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.నాగ సోమేశ్వరమ్మ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె.సీతా రామయ్య ప్రసంగించారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.