
భారత్ గౌరవ్ ప్రత్యేక వేసవి పర్యాటక ప్యాకేజీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైళ్లు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సత్యకిశోర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఏరియా మేనేజర్ రాజాతో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించి, ప్యాకేజీ వివరాలను వెల్లడించారు.
దివ్య దక్షిణ యాత్ర..
దివ్య దక్షిణ యాత్ర పేరుతో నడిచే ఈ ప్రత్యేక పర్యాటక రైలు విజయవాడ మీదుగా ఈ నెల 22న సికింద్రాబాద్లో బయలుదేరి, తిరిగి 30న సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ యాత్రలో అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శింపచేస్తారు. మూడు కేటగిరిల్లో ఉన్న ఈ ప్యాకేజీలో ఎకానమీ(స్లీపర్ క్లాస్)లో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.14,700, పిల్లలకు రూ.13,700, స్టాండర్డ్(3 ఏసీ) పెద్దలకు రూ.22,900, పిల్లలకు రూ.21,700, కంఫార్ట్(2 ఏసీ) పెద్దలకు రూ. 29,900, పిల్లలకు రూ.28,400 ధరగా నిర్ణయించారు. ఈ ప్రయాణంలో సందర్శన ప్రాంతాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, హోటళ్లలో బస, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, భోజన సదుపాయాలు, ప్రతి కోచ్లో ఎస్కార్ట్, సందర్శించే ప్రదేశాల్లో గైడ్, ప్రమాద బీమా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
హరిద్వార్, రిషికేశ్, వైష్ణోదేవి యాత్ర..
జూన్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో హరిద్వార్, రిషికేశ్, ఆనంద్పూర్, నైనా దేవి ఆలయం, అమృత్సర్, మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ఎకానమీ పెద్దలకు రూ.18,510, పిల్లలకు రూ.17,390, స్టాండర్డ్ పెద్దలకు రూ.30,730, పిల్లలకు రూ.29,420, కంఫార్ట్ పెద్దలకు రూ.40,685, పిల్లలకు రూ.39,110 ధరగా నిర్ణయించారు.
గంగా రామాయణ యాత్ర..
సరస్వతి పుష్కరాల సందర్భంగా గంగా రామాయణ ప్రత్యేక పర్యటక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో కాశీ, అయోధ్య, నైమిషరన్య, ప్రయాగ్రాజ్ తదితరా ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ యాత్రలో ఎకానమీ పెద్దలకు రూ.16,800, పిల్లలకు రూ.15,700, స్టాండర్డ్ పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, కంఫార్ట్ రూ.34,900, పిల్లలకు రూ.33,300 ధరగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయవాడ రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో లేదా 92814 95848, 92810 30714 నంబర్లలో బుక్ చేసుకోవాలని కోరారు.
టూరిజం అధికారులు సత్యకిశోర్, రాజా
బ్రోచర్ ఆవిష్కరణ