
దుర్గగుడి ఈవో బాధ్యతల స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన నూతన ఈవోగా డెప్యూటీ కలెక్టర్ వీకే శీనానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం దుర్గగుడికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయానికి చేరుకున్న శీనానాయక్ను ఆలయ ఈఈ కోటేశ్వరరావు, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని చాంబర్లో ఈవోగా కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసే ప్రతి సామాన్య భక్తుడు వీఐపీతో సమానమేనని, వారికి గౌరవించి అమ్మవారి శీఘ్ర దర్శనం కల్పిస్తామన్నారు. దుర్గగుడి అభివృద్దికి పెద్ద పీట వేస్తామని, పనుల్లో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. అనంతరం మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు జరిపించుకున్నారు.
కీలక విభాగాల పరిశీలన..
ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శీనా నాయక్ ఆలయంలో పలు కీలక విభాగాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న పూజా మండపం, యాగశాల, నూతన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాలను పరిశీలించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తు, మూడో అంతస్తులో జరుగుతున్న అన్నదానాన్ని పరిశీలించారు. అన్నప్రసాదం నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. నాల్గవ అంతస్తులోని దేవస్థాన పరిపాలనా విభాగానికి చేరుకుని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, అకౌంట్స్, లీజెస్, స్టేషనరీ విభాగాలను పరిశీలించారు. ఆయా చాంబర్లలో అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాంబర్లలో కుర్చీలు అన్ని ఖాళీగా ఉన్నాయేంటని తన వెంట ఉన్న సీసీని అడిగారు. శుక్రవారం కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది మొత్తానికి క్యూ లైన్ల వద్ద ప్రత్యేక విధులు కేటాయిస్తారని వివరించారు.
భారత సైన్యం కోసం
ప్రత్యేక పూజలు
భారత దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న త్రివిధ దళాల సైన్యానికి స్థైర్యం ఇవ్వాలని దుర్గగుడిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.