
అనుమానితులు కనబడితే సమాచారం ఇవ్వండి
కోనేరుసెంటర్: జిల్లాలో అనుమానిత వ్యక్తులు, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలు కనబడితే ప్రజలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కోరారు. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటలను అరికట్టేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం మాక్ డ్రిల్ నిర్వహించింది. మాక్ డ్రిల్లో ఎస్పీ గంగాధరరావు స్వయంగా పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వాహనాలను తనిఖీలను దగ్గరుండి పరిశీలించారు. తొలుత ఎస్పీ మచిలీపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుమూడి వారధి వద్ద ఉన్న చెక్ పోస్ట్ను పరిశీలించి, అక్కడ సీసీ కెమెరాల పని తీరును ఆరా తీశారు. ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శలు చేసిన తప్పుడు ప్రచారాలకు పాల్పడిన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై 94407 96400 సమాచారం ఇవ్వాలని, సమాజ రక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.