
‘జీవనోపాధి’ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికను సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారుచేసేందుకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంట్లో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే జూన్ నెల మొదటి వారంలో కొత్త రుణాలతో పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పేందుకు సంసిద్ధం కావాలన్నారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ప్రధానంగా ఏడు గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా నూరు శాతం పూర్తిస్థాయిలో జీవనోపాధులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు.
వ్యాపార యూనిట్లు నెలకొల్పేందుకు కృషి..
చల్లపల్లి మండలం నూకలవారిపాలెం, ఉంగుటూరు మండలం వెన్నుతల, నందివాడ మండలం తుమ్మలపల్లి, బందరు మండలం గరాలదిబ్బ, పమిడిముక్కల మండలం మల్లపూడి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, పెనమలూరు మండలం గంగూరు గ్రామాలను ఎంపిక చేశామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. కొత్త వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఇప్పటికే తెలుసుకున్నామని, దానిని అనుసరించి ఎస్హెచ్జీల అంతర్గత రుణ సహాయం, ఉన్నతి, శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్ తదితర పథకాలను అనుసంధానం చేస్తూ బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించి వ్యాపార యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు ఇవ్వటం ముఖ్యంకాదని, లబ్ధిదారులు తప్పనిసరిగా సంబంధిత యూనిట్లు నెలకొల్పి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి చిననరసింహులు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ వెంకట్రావు, వ్యవసాయశాఖ అధికారి మనోహర్, మత్స్యశాఖ అధికారి నాగరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకరరావు, ఏపీఎంఐపీ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.