
హంసలదీవి టు మహాబలేశ్వరం !
కోడూరు: కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుంచి రక్షించి, భవిష్యత్ తరాలకు సురక్షితమైన నది జాలలు అందించాలనే సంకల్పంతో జల బిరాదారి జాతీయ కన్వీనర్, జనసేన పార్టీ పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కృష్ణా జలయాత్రను ప్రారంభించారు. హంసలదీవి పుష్కరఘాట్ వద్ద నుంచి శుక్రవారం ఈ యాత్రకు బొలిశెట్టి శ్రీకారం చుట్టారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు, విద్యార్థులు, మేధావులను సమన్వయం చేస్తూ జలయాత్రను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ‘కృష్ణానది నాది.. దాని పరిరక్షణ బాధ్యత నాది’ అనే నినాదంతో ఈ యాత్ర సాగుతుందని, నదిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలన్నారు. హంసలదీవి నుంచి యాత్రను ప్రారంభించి విజయవాడ కనకదుర్గా ఘాట్, శ్రీశైలం, కర్నూలు, తెలంగాణ సంగమేశ్వరం, కర్ణాటకలోని అలంపూర్, కుడల్ సంగం, మహారాష్ట్రలోని ఆల్మట్టి, ఉజని మీదగా మహాబలేశ్వరం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
కృష్ణానది పరిరక్షణ అందరి బాధ్యత..
తెలుగువారి జీవనాధరమైన కృష్ణానదిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నదిలో కాలుష్యాన్ని నివారించడంతో పాటు నది ఆక్రమణకు గురి కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సత్యనారాయణ, బుద్ధప్రసాద్లు ఉల్లిపాలెం వారధి వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని పరిశీలించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత సత్యన్నారాయణ, పర్యావరణవేత్త అనుమోలు గాంధీ, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), పీసీ కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, చల్లపల్లి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ కనకదుర్గ, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.