
క్షిపణి ప్రయోగ కేంద్రంకు పచ్చజెండా
మే 2న ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం
అవనిగడ్డ: కృష్ణాజిల్లాకు మణిహారం కానున్న నాగాయలంక మండలంలోని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రంకు ఎట్టకేలకు మోక్షం లబించింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు.
డీఆర్డీఏ ఆధ్వర్యంలో రక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించగా, 2012లో నాగాయలంక మండలం గుల్లలమోద అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు కోసం 386 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. 2017లో కొంత రెవెన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించి ఆ మేరకు అటవీభూమిని ఈ ప్రాజెక్టుకు బదిలీచేశారు. ఇందుకోసం రూ.35కోట్లు చెల్లించారు. అదే సంవత్సరం తొలిదశ అనుమతులు లభించాయి. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్జెడ్ పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలివిడతగా రూ.1800 కోట్లు నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, కొన్ని భవనాలు నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.
14 ఏళ్లకు మోక్షం
మచిలీపట్నం ఆర్డీవో స్వాతి ఆదివారం గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. గత 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంకు అడ్డంకులు తొలగి ప్రారంభోత్సవం కానుండటంతో దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.