జైనూర్‌ ఆస్పత్రిని ఉన్నతీకరించాలని మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

జైనూర్‌ ఆస్పత్రిని ఉన్నతీకరించాలని మంత్రికి వినతి

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

కెరమెరి(జైనూర్‌): జైనూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. శాలువాతో సన్మానించి వినతిపత్రం అందించారు. జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి, నార్నూర్‌ మండలాల ఆదివాసీలకు జైనూర్‌ ఆస్పత్రి ప్రధాన వైద్య కేంద్రంగా సేవలందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పడకలు, వైద్యులు, నర్సులు, వైద్య పరికరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు వైద్య పరీక్షలకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సుగుణ పేర్కొన్నారు. ఆమె వెంట మార్లావాయి సర్పంచ్‌ ప్రతిభ ఉన్నారు.

మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు కృషి

కాగజ్‌నగర్‌టౌన్‌: మహిళలకు స్వ యం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కొత్తపల్లి అనిత పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర ఆప్టికల్‌ హాల్‌లో కొత్తపల్లి వెంకటలక్ష్మీచంద్ర య్య మెమోరియల్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగా లని, తమ కాళ్లమీద తాము నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పే ర్కొన్నారు. రెండు నెలల శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, వార్డ్‌ ఆఫీసర్‌ సుజాత, ఆర్పీ మాధవి, ఇన్‌స్ట్రక్టర్‌ సవిత, వినోద, నాగమణి, శ్రీనివాస్‌ వసంత్‌, మహిళలు పాల్గొన్నారు.

తుడుందెబ్బ బహిరంగ సభ విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జూలై 31న కుమ్రంభీం పోరుగడ్డలో లక్ష మందితో నిర్వహించనున్న తు డుందెబ్బ బహిరంగ సభను విజయవంతం చేయాలని తు డుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కో ట్నాక విజయ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోండువాన రాయిసెంటర్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే లంబాడాల వలసలపై జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారానే షెడ్యూల్‌ ప్రాంత ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా అడవికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల సమస్యలపై చర్యలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జూలై 1నుంచి డిసెంబర్‌ 30వరకు పోరాట కార్యాచరణ రూపొందించి ఉద్యమాలను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. రాంజ్‌గోండ్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మడావి శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, జిల్లా సర్‌మేడి అధ్యక్షుడు మోతీరాం, తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి జంగు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement