ఆసిఫాబాద్ పట్టణంలో 20 వార్డు ఉన్నాయి. 6,512 కుటుంబాలు, 20 వేల వరకు జనాభా ఉంది. 120 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. గతేడాది పైకాజీనగర్, బజార్వాడీ, రవిచంద్ర కాలనీ, తదితర కాలనీల ప్రజలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇళ్ల ఎదుట అక్రమంగా ర్యాంపులు నిర్మించారు. తద్వారా డ్రెయినేజీల్లో పూడిక తీయడం కష్టంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా రోడ్లపైకి వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు ఎప్పటికప్పుడు పూడిక తీయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైకాజీనగర్, బ్రాహ్మణవాడ, బజార్వాడీ రహమత్నగర్, రవిచంద్ర కాలనీ, హడ్కో కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఓపెన్ ప్లాట్లు దోమలకు ఆవాసాలుగా మారాయి. పిచ్చిమొక్కలు పెరిగి విష సర్పాలు ఇళ్ల మధ్యే తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు ట్రాక్టర్లు, ఐదు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నామని, త్వరలో మరో రెండు ట్రాక్టర్లు అద్దెకు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.


