వాంకిడి: పశువుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీఎస్పీ అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసిందని తెలిపారు. అక్రమ రవాణా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. శుభకార్యాల్లో డీజే వాడకం నిషేధమని, ఎవరైనా డీజేలు పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. యువత మత్తుమాయలో పడకుండా ఉన్నత భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్ పాల్గొన్నారు.


