దహెగాం: ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, సరుకులు ఇంటికే సరఫరా చేయనున్నారు. బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, పల్లీపట్టీలు, మురుకులు, మిల్లెట్స్, బాలామృతం అందిస్తారు. అలాగే నెలరోజులపాటు వారి ఆరో గ్యంపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు.
1,006 కేంద్రాలు..
జిల్లావ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్ల లోపు చిన్నారులు సుమారుగా 37,353 మంది, గర్భిణులు 2,903, బాలింతలు 1,573 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది సరుకులు ఇంటికే వెళ్లి అందిస్తారు.
గృహాల సందర్శన..
వేసవి సెలవులైనా బాలింతలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది గృహ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం తెలుసుకుంటా రు. ఆరోగ్యం బాగా లేకుంటే స్థానిక ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తారు. చి న్నారుల బరువు, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పోషణపై అవగాహన కల్పిస్తారు.
సెలవుల అనంతరం ‘అంగన్వాడీ బాట’
వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు చేపడతారు. కేంద్రాల్లో ఐదేళ్ల వారు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. అలాగే చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోవడానికి ‘అమ్మమాట– అంగన్వాడీ బడిబాట’ కార్యక్రమం ద్వారా గుర్తిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సెంటర్లలో చేర్పిస్తారు.
సరుకులు అందించడానికి చర్యలు
అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు అవసరమైన సేవలు నిలిపివేయం. సేవలు యథా విధిగా కొనసాగుతుతాయి. లబ్ధిదారులకు సరుకులు ఇంటికే అందించడానికి చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచే వచ్చే పౌష్టికాహారం నేరుగా వా రి ఇళ్ల వద్ద అందిస్తాం. గృహ సందర్శన కార్యక్ర మం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తాం.
– రెబెకా, ఐసీడీఎస్ సీడీపీవో


