ఆసిఫాబాద్రూరల్/కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో జైనూర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. పి.లోకేశ్వరి జిల్లా టాపర్గా నిలవగా, అదే పాఠశాలకు చెందిన ఎం.ఆర్థిక రెండో స్థానం, ఎ.సంధ్యారాణి మూడో స్థానం దక్కించుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 13 ఆశ్రమోన్నత పాఠశాలల హెచ్ఎంలు, టాపర్లుగా నిలిచిన గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులను డీటీడీవో రమాదేవితో కలిసి కలెక్టర్ హరిత అభినందించారు. గిరిజన విద్యార్థులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీవో మంద మకరందు అభినందించి శాలువాతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జీసీడీవో శకుంతల, ఏసీఎం ఉద్దవ్, ఏటీడీవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, ఉపాధ్యాయులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


