కౌటాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 7న కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి రానున్నట్లు సమాచారం. తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రావిటీతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీటిని తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బరాజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్రను ఒప్పించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణపై సమీక్షించారు. ఈ నెల 7న తుమ్మిడిహెట్టిలో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పర్యటించి ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. కాలువ నిర్మాణం, ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించనున్నారు. మహారాష్ట్రలో ఏ మేరకు ముంపు ఉంటుందో స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ కె.హరిత తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది పరిసరాలను పరిశీలించనున్నారని సమాచారం.


