వాంకిడి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీసుకువచ్చిన నూతన విధానంతో విద్యుత్ సేవలు సులభతరంగా, పారదర్శకంగా అందనున్నాయి. కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ సర్వీస్ లైన్ చార్జీలు లోడ్ ఆధారంగా చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వ్యక్తిగత క్షేత్రస్థాయి తనిఖీల అవసరం లేకుండా కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. గతంలో విద్యుత్ కనెక్షన్ కావాలంలే సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ ప్రతిపాదనలు రూపొందించి దాని ప్రకారం దరఖాస్తుదారులు రుసుం చెల్లించేవారు. ఈ విధానాన్ని సవరిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి కొత్తగా రెగ్యులేషన్ నం.1 ఆఫ్ 2026 ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన పద్ధతిలో ఒక కిలోమీటరు దూరం వరకు ఎలాంటి చార్జీలు వర్తించవు. కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉండే సర్వీసులకు మాత్రమే లోడ్ ఆధారంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన లేకుండానే త్వరితగతిన సర్వీసులు మంజూరు చేస్తారు. కాగా జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
నూతన విధానంలో చార్జీల వివరాలు
జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గృహ వినియోగ కనెక్షన్లు 1,41,933 ఉండగా, వ్యాపార కనెక్షన్లు 15, 190, వ్యవసాయ కనెక్షన్లు 15,373 ఉన్నాయి. నూతన విధానంలో గృహ వినియోగదారులు కిలో వాట్ వరకు 500 సర్వీస్ లైన్ చార్జీలు చెల్లించాలి.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
గృహ వినియోగ 1,41,933
వ్యాపార 15,190
ఎల్టీ ఇండస్ట్రీయల్ 630
కోటేజ్ ఇండస్ట్రీస్ 11
వ్యవసాయం 15,373
హైటెన్షన్ కనెక్షన్లు(హెచ్టీ) 104
ఇతరాలు 5,720
లోడ్ ఆధారంగా చార్జీలు..
అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీస్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు వర్తిస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఖర్చు భారం వినియోగదారుడిపై మోపరు. ట్రాన్స్ఫార్మర్ సరఫరా, ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు ఉండవు. శాఖ వారే బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏకరీతి విధానంతో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సులభంగా అందనున్నాయి.


