కాగజ్నగర్టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బుధవారం జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందని తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తలండి మధుకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడుమెత శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి మండాది దేవ్రావు, కోశాధికారి ఆలం సందీప్, ఉపాధ్యక్షుడు కేశవులు, నా యకులు భిక్షపతి, లాలయ్య, పాపయ్య, వెంకటేశ్, కిష్టయ్య, నందక్క, శ్రీరంగం పాల్గొన్నారు.
ప్రమోషన్లు కల్పించాలని ధర్నా
రెబ్బెన: పంప్ ఆపరేటర్లకు ప్రమోషన్లు కల్పించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఏడు నెలలుగా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మైన్స్, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు. అర్హులకు ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు శేషశయనరావు, జూపాక రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్బాబు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, నరేశ్, గణేష్, రారాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


