వాంకిడి: ఆరోగ్యకరమైన భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టినట్లు ‘మిషన్ హెల్తీ భారత్’స్థాపకురాలు తాప్సీ ఉపాధ్యాయ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి చేపట్టిన యాత్ర మంగళవారం వాంకిడి చేరుకోగా బీజేవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక కేజీబీవీలో జీవనశైలి సంబంధిత వ్యాధులు, యువతలో పెరుగుతున్న స్థూలకాయంపై అవగాహన కల్పించారు. ఫిట్నెస్, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు తదితర అంశాలను వివరించారు. అనంతరం ‘మన లక్ష్యం ఆరోగ్యకరమైన భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బైక్ యాత్ర నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశాల్, వికాస్, వానేశ్, స్వరాజ్, కుందన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


