పరిమితి దాటితే ప్రమాదమే..
కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్, అతడి భార్య సునీత(45), కుమార్తె అక్షిత(21)తోపాటు గ్రామానికి చెందిన మరికొందరు, బంధువులు మొత్తం 25 మంది జనవరి 27న ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి– కేశవాపూర్ అటవీ ప్రాంతంలో రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. తల్లీకుమార్తెలు సునీత, అక్షిత ట్రాలీ కింద పడి ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. ఇలా జిల్లాకు చెందిన ప్రజలు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
కౌటాల: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రమాదమని తెలిసినా జాతరలు, శుభకార్యాలకు ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. చౌక ప్రయాణమని లారీలు, ట్రాక్టర్లు, బొలెరో, వ్యాన్లు ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ప్రైవేట్పైనే ఆధారం
మేడారం మహా జాతరకు జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్లారు. అలాగే జిల్లాలో ఇతర జాతరలు, ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. సరిహద్దులోని మహారాష్ట్రలో జరిగే వేడుకులకు జిల్లా ప్రజలు హాజరవుతుంటారు. వేలాది భక్తులు ఒకేసారి వెళ్తుండడంతో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో చాలామంది చౌకగా వస్తున్న ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని యజమానులు కూడా జాగ్రతలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రజలను తరలిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం ఫిట్నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. అధిక లోడు, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతున్నాయి. శుభకార్యాలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినా అవగాహన లేక జిల్లాలో చాలామంది వినియోగించుకోవడం లేదు.
ఆగని ప్రమాదాలు..
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, జాతరలకు ప్రైవేట్ వాహనాలను వినియోగిస్తున్నారు. వాహనాల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలను కిక్కిరి ఎక్కిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 29న చింతలమానెపల్లి మండలం కోయపెల్లి గ్రామం సమీపంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరి గాయాలయ్యాయి. ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడటంతో తొమ్మిది మంది ట్రాలీ కింద చిక్కుకున్నారు. స్థానికులు పోలీసుల సాయంతో వారిని రక్షించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో సర్వసాధారణంగా మారాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పలు జాతరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలపై అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
నిర్లక్ష్యం వద్దు
వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి వెళ్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ వాహనాల యజమానులపై చర్యలు తీసుకుంటాం.
– వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్
రెండేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు గాయాలు
2024 133 60 63
2025 267 60 74
పరిమితి దాటితే ప్రమాదమే..
పరిమితి దాటితే ప్రమాదమే..


