ఏర్పాటుకు సన్నాహాలు నీటి వనరులపై పర్యవేక్షణ చెరువుల అభివృద్ధి ఆయకట్టుకు రైతులకు తొలగనున్న ఇక్కట్లు
ఆసిఫాబాద్అర్బన్: వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించేందుకు గతంలో సంఘాల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండేది. కానీ 16 సంవత్సరాలుగా సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పర్యవేక్షణ లోపించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో మిషన్ కాకతీయ అధికారులకు పనిభారం తగ్గడమే కాకుండా నీటి వనరుల పర్యవేక్షణ మెరుగుపడనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. ఆయా చెరువులు, ప్రాజెక్టులను వారే పర్యవేక్షించేవారు. వాటి పరిధిలో ఏంజరిగినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సత్వర పరిష్కారానికి కృషి చేసేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద ఏ పని జరిగినా అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ఫలితంగా నీటి వనరుల సమస్యలను గుర్తించడంలో జాప్యం జరిగి నష్టం వాటిల్లుతోంది. అంతే కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం లేదు. అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాల్వల్లో ఆశించిన స్థాయిలో సాగునీరు రావడం లేదు. అదే సంఘాలు ఉంటే సభ్యులుగా ఉండే రైతులు,అధికారుల సమన్వయంతో ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం
ఉంటుంది.
16 ఏళ్లుగా ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం..
జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు, అంతకంటే ఎక్కువగా ఉన్న చెరువులు మొత్తం 544 ఉన్నాయి. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో 231 చెరువుల కింద 46,571 ఎకరాల సాగు భూమి ఉండగా, కాగజ్నగర్ డివిజన్ పరిధిలో 313 చెరువుల పరిధిలో 36,525 ఎకరాలు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా నీటి సంఘాల ఎన్నికల ఊసెత్తలేదు. గత ప్రభుత్వ హయంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. కానీ నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు తుతూ మంత్రంగా పనులు చేపట్టి చేతులెత్తేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సాగునీటి సంఘాల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
ఎన్నికల నిర్వహణ ఇలా..
గత ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నో టిఫికేషన్ విడుదల చేయగానే వంద ఎకరాల ఆయకుట్టు ఉన్న ప్రధాన చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంట పొలాలకు పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయపర్చుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించేవారు. కానీ పదహారేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ మందగించింది.