
● హైకోర్టు ఉత్తర్వులతో నిలిచిన ప్రక్రియ ● నోటిఫికేషన్
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే విధించింది. హైకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను రద్దు చేసింది. గురువారం ఉదయం జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ఆయా మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులు, సి బ్బందికి సూచనలు చేశారు. అయితే హైకోర్టు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్, జీవో 9పై స్టే విధించడంతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
జిల్లాలో పది నామినేషన్లు
జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. 335 పంచాయతీలు, 2,874 వార్డులు, 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. ఇందులో భాగంగా మొదటి దశలో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్నగర్, రెబ్బెన, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిరోజు జెడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్, ఎంపీటీసీలకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. చింతలమానెపల్లి జెడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖాలు కాగా, కాగజ్నగర్లో ఎంపీటీసీ స్థానానికి ఒకటి, కౌటాలలో ఒకటి, సిర్పూర్(టి)లో రెండు, రెబ్బెనలో మూడు, చింతలమానెపల్లిలో మూడు నామినేషన్లు వచ్చాయి. బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లో నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
నిరీక్షణ తప్పదా..?
హైకోర్టు ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రి య నిలిచిపోయింది. ప్రస్తుతం హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే విధించడంతో అభ్యర్థులకు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సందిగ్ధంలో పడ్డారు. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నరకు పైగా గడిచింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంతో పోలిస్తే రిజర్వేషన్లు తారుమారయ్యాయి. ఆశావహులు అనుకూలమైన స్థానా లు వెతుక్కున్నారు. ముఖ్యంగా జెడ్పీ పీఠంపై దృష్టి సారించిన వారు పక్క మండలాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రచారం చేయాలా.. వేచిచూడాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లు మారితే మళ్లీ కొత్త ప్రాంతంలో మొదటి నుంచి ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.