పత్తాలాట.. కోడిపందేలు | - | Sakshi
Sakshi News home page

పత్తాలాట.. కోడిపందేలు

Sep 19 2025 2:05 AM | Updated on Sep 19 2025 2:05 AM

పత్తాలాట.. కోడిపందేలు

పత్తాలాట.. కోడిపందేలు

● జిల్లాలో విచ్చలవిడిగా జూద క్రీడలు ● అప్పులపాలవుతున్న యువకులు ● రోడ్డున పడుతున్న కుటుంబాలు ● ఈ నెల 2న జైనూర్‌ మండలం పట్నాపూర్‌ శివారులో పేకాడుతున్న 11 మందిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ● గత నెల 24న పెంచికల్‌పేట్‌ మండలం దరోగపల్లి, కొండపల్లి గ్రామాల సమీపంలో కొనసాగుతున్న కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. నాలుగు పుంజులు, రూ.2320 నగదు స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ● కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లి శివారులో ఆగస్టు 24న కోడి పందేలు ఆడుతుండగా పోలీసులు రెండు కోడి పుంజులు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేయగా పలువురు పారిపోయారు. ● గత నెల 23న పెంచికల్‌పేట్‌ మండలం గొంట్లపేట్‌ శివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పందెం కోడితో పాటు బైక్‌, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు పెట్టారు. ● కౌటాల మండలం తలోడి గ్రామంలో పేకాట స్థావరంపై గత నెల 21న పోలీసులు దాడి చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రూ.10,980 నగదు స్వాధీనం చేసుకున్నారు.

కౌటాల మండలం గురుడుపేటకు చెందిన మహిళలు పేకాటను నియంత్రించాలని ఇటీవల స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. యువత పేకాడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో నాటుసారా విక్రయాలు, అక్రమ దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుడుపేట గ్రామంలోనే కాకుండా జిల్లాలోని పలు పల్లెల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పత్తాలాట, కోడి పందేలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.

కౌటాల(సిర్పూర్‌): మరికొద్ది రోజుల్లో దసరా సంబురాలు ప్రారంభం కానుండగా, జిల్లాలో పేకాట, కోడి పందేలు జోరందుకున్నాయి. పోలీసుల దాడుల్లో కొందరు పట్టబడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత జూద క్రీడలకు బానిసలుగా మారి అప్పులపాలవుతున్నారు. పేకాట, కోడి పందేల నిర్వహణకు ప్రత్యేక స్థావరాలు సైతం ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.

ఇదీ పరిస్థితి..

కౌటాల, వాంకిడి, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్‌పేట్‌, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి), జైనూర్‌ మండలాల్లో పేకాట జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల శివారుల్లోనూ నిత్యం స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల దాడులకు తాత్కాలికంగా భయపడినా మళ్లీ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణ శివారులోని ఈజ్‌గాం, భట్టుపల్లి, అంకుసాపూర్‌ ప్రాంతాలైతే పేకాట స్థావరాలకు పేరుమోశాయి. మరికొందరు బడాబాబులు ఏకంగా సరిహద్దు దాటి మహారాష్ట్రలోని దాబాల్లో రూ.లక్షలు పెడుతూ జూదంలో మునిగిపోతున్నారు.

ఆది, బుధవారాల్లో మహారాష్ట్రకు..

జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పల్లెల్లో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ ఆదివారం, బుధవారం మహారాష్ట్రలో నిర్వహించే కోడి పందేలకు జిల్లా నుంచి పదుల సంఖ్యలో తరలివెళ్తున్నారు. దసరా పండుగకు నిర్వహించే పందేల కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా పుంజులు పెంచుతున్నారు. రూ.వేలల్లో బెట్టింగ్‌ కాస్తూ అప్పులపాలవుతున్నారు. పోలీసులు పేకా ట, కోడి పందేలపై దాడులు నిర్వహించినా నిందితులపై పీటీ కేసులు మాత్రమే పెడుతున్నారు. నిందితులు కోర్టుల్లో నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడుతున్నారు. కొందరు పోలీసులు పేకాట నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇస్తూ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవలి ఘటనలు

కఠిన చర్యలు తప్పవు

జిల్లాలో చట్టవిరుద్ధంగా పేకాట, కోడిపందేలు ఆడితే చర్యలు తప్పవు. కేసులు నమోదు చేస్తాం. వ్యసనాల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. తరుచూ తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలి.

– కాంతిలాల్‌ పాటిల్‌, ఎస్పీ

గడిచిన ఎనిమిది నెలల్లో నమోదైన కేసులు

దాడులు కేసులు నిందితులు పట్టుకున్న నగదు

పేకాట 90 507 రూ.4,69,470

కోడి పందేలు 16 88 రూ.25,660

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement