
ప్రజావాణికి వినతుల వెల్లువ
పింఛన్ మంజూరు చేయాలి
నేను పేదవాడిని. కళ్లు కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. భూమితో పాటు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– కంది బాపు, బారెగూడ, మం.బెజ్జూర్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతులు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ ఎస్సీ కాలనీకి చెందిన శిల్పారాణి దరఖాస్తు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో చదువుకున్న తన కుమార్తె ధ్రువపత్రాలు ఇప్పించాలని పైకాజీనగర్కు చెందిన నైతం మోహన్ కోరాడు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ శివారులోని భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని పెరుమాండ్ల వెంకటేశ్ అర్జీ అందించాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్కు చెందిన విలా స్, జన్కాపూర్కు చెందిన సమీనాబాగం దరఖాస్తు చేసుకున్నారు. కౌటాల మండలం కన్నెపల్లికి చెందిన మోర్ల పాండుమేర తన తండ్రి పేరుతో ఉన్న పట్టా భూమిని విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వట్టివాగు కాలువకు మరమ్మతు చేయాలి
వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ డీ 4కు పది రోజుల క్రితం గండి పడింది. కాలువ కింద రెబ్బెన మండలంలో 8 వేల మంది వరి సాగు చేసుకున్నారు. మరికొంత మంది వేయాల్సి ఉంది. కాలువకు వెంటనే మరమ్మతు చేయాలి.
– కార్నాథం సంజీవ్కుమార్, సింగిల్విండో చైర్మన్, రెబ్బెన
సొంతిల్లు లేదు
నేను నిరుపేదరాలిని. సొంతిల్లు లేదు. వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతున్నాను. గ్రామంలో ఇంటిస్థలం ఉంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– సింగరి పుల్లక్క, నంబాల, మం.రెబ్బెన
అక్రమంగా పట్టా మార్చిండ్రు
వంశపారపర్యంగా నాకు సంక్రమించిన రెండుకరాల వ్యవసాయ భూమి ఉంది. తండ్రి పేరు నుంచి నా పేరుతో విరాసత్ చేయిస్తానని ఓ వ్యక్తి తప్పుడు సంతకాలు చేయించుకుని అక్రమంగా పట్టా మార్చుకున్నాడు. నా భూమి నాకు ఇప్పించాలి.
– నంది రజిత, తక్కళ్లపల్లి, మం.రెబ్బెన
సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి
సమాచార హక్కు చట్టం కింద కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతభత్యాలు, ఈఎస్ఐ, పీఎఫ్పై తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలి.
– కార్తీక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ