
కొట్లాడితేనే కొత్త గనులు
సొంతింటి పథకం సాధించాలి మాజీ మంత్రి వేణుగోపాలాచారి ముగిసిన హెచ్ఎంఎస్ మహాసభలు గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నిక
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికవర్గం కొట్లాడితేనే కొత్త గనులు వస్తాయని.. అప్పుడే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హెచ్ఎంఎస్ నేత, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. రెండు రోజులుగా నస్పూర్ పట్టణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ 26వ ద్వైపాక్షిక మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల పక్షాన పోరాడి సొంతింటి పథకం సాధించాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన వార్షిక లాభాలు నుంచి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈసారి 10 శాతం వాటా చెల్లించాలన్నారు. బొగ్గు గనుల వేలంతో సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిలిపివేసి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పెర్క్స్పై ఆదాయ పన్ను సింగరేణి యాజమాన్యమే చెల్లించాలన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని దీనిని రూపుమాపాలన్నారు. మారుపేర్ల సమస్య పరిష్కరించాలన్నారు.
యూనియన్ పేరు మార్పు..
ఇప్పటివరకు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా ఉన్న పేరును ఇక నుంచి అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా మార్చుతున్నట్లు ఆ యూనియన్ మాతృ సంఘం హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. యూనియన్ను మరింత బలోపేతం చేయడానికి ఈ మార్పు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
గౌరవ అధ్యక్షురాలుగా కవిత..
మహాసభల్లో భాగంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపై ఆమె యూనియన్ గౌరవ ప్రదమైన స్థానంలో కొనసాగుతారన్నారు. అంత కుముందు ఇందారం చౌరస్తా నుంచి మహాసభల వేదిక వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జెండా ఆవిష్కరించిన అనంతరం మహాసభలు కొనసాగించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నా యకులు జమీల్, యూనియన్ కేంద్ర అధ్యక్షుడు సారయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, మందమర్రి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు రాజబాబు, శ్రీరాంపూర్ డివిజన్ నాయకులు అశోక్, సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు.