
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం ఓటరు ముసాయిదా తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,76,610 మంది పురుషులు, 1,77,274 మంది మహిళలు, ఇతరులు 20 మంది ఉన్నారు. గతేడాది జాబితాతో పోలిస్తే జిల్లాలో 5,575 మంది ఓటర్లు పెరిగారు. గత పంచాయతీ ఎన్నికల ముందు జిల్లాలో 3,48,329 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,74,179 మంది పురుషులు, 1,74,034 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు.
నేడు, రేపు రాజకీయ ప్రజాప్రతినిధులతో సమావేశం
జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమావేశం కానున్నారు. శనివారం మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలిపే అవకాశం కల్పించారు. ఆదివారం ఈ అభ్యంతరాలపై డీపీవో ఆధ్వర్యంలో పరిష్కారం చూపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో తుది జాబితా ప్రచురిస్తామని డీపీవో భిక్షపతి గౌడ్ వెల్లడించారు.