
మూగ వేదన..!
కనికరం లేకుండా ఇరుకు వాహనాల్లో పశువుల రవాణా వరద నీటిలోనూ ప్రమాదకరంగా తరలింపు ఊపిరాడక మృత్యువాత పడుతున్న వైనం
ఈ నెల 2వ తేదీన చింతలమానెపల్లి మండలం గూడెం సరిహద్దు వద్ద ఒక బొలెరో వాహనంలో ఆరు పశువులను తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అప్పటికే ఊపిరాడ క అందులో మూడు చనిపోయాయి. మరో రెండు పశువులు కొన ఊపిరితో ఉండగా వాటికి మహారాష్ట్రకు చెందిన పశువైద్య సిబ్బంది వైద్యం అందించారు. ఈ ఘటనపై అహేరి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
చింతలమానెపల్లి(సిర్పూర్): మూగజీవాలపై అక్రమార్కులు కనికరం చూపడం లేదు. దురాశతో ఇరు కు వాహనాల్లో కుక్కి పరిమితికి మించి తరలిస్తున్నా రు. నదుల ప్రవాహంలో నాటు పడవలకు కట్టి సరి హద్దు దాటిస్తున్నారు. ఊపిరాడక పశువులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు కేవలం ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ నెల 23న దహెగాం మండలం లగ్గాం వద్ద ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీ సులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అనుమతి తప్పనిసరి
జిల్లావ్యాప్తంగా 2023 నాటి లెక్కల ప్రకారం 2లక్ష ల 64వేలకు పైగా పశువులు ఉన్నాయి. కౌటాల, జైనూర్, వాంకిడి మండలం సోనాపూర్లో పశువుల సంతలు ఉన్నాయి. రైతులు వారసంతలో పశువుల క్రయవిక్రయాలు జరపడానికి నిబంధనలను అనుసరించి అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పశువులు కొనుగోలు చేసే గ్రామంలో సంబంధి త యజమాని అనుమతి పొందాలి. పశువును ధ్రు వీకరిస్తూ గ్రామ పంచాయితీ, పశువైద్యశాల నుంచి అనుమతులను పొందాలి. ఆవులను కబేళాలకు తరలించడానికి అనుమతి లేదు. కబేళాకు తరలించే ఎద్దు వయస్సు 14 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. మూగజీవాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి వాహనంలో గాలి వెలుతురు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇబ్బంది కలగకుండా ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల చెక్పోస్ట్లో సిబ్బంది, అధికారులకు అనుమతి పత్రాలు చూపించి సహకరించాలి.
చెక్పోస్ట్ల ఏర్పాటు
పశువుల అక్రమ రవాణా పెరిగిపోవడంతో పోలీసులు చింతలమానెపల్లి మండలం గూడెం, డబ్బా, కౌటాల మండలం తాటిపల్లి చౌరాస్తాతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పశువుల సంతలకు తరలించి విక్రయాలు చేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే పశువుల వ్యాపారులు చెక్పోస్ట్ల నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. చింతలమానెపల్లి, కౌటాల మండలాల సరిహద్దులలోని వార్దా, ప్రాణహిత నదుల నుంచి ప్రమాదకరంగా మూగజీవాలను దాటిస్తున్నారు. ఇటీవల కౌటాల మండలం తాటిపల్లి వద్ద పశువులను పడవలకు కట్టి వరద నీటిలో తరలించారు. వరద నీటిలో ప్రవాహానికి ఈదలేక ఊపిరాడక పోవడంతో పశువులు కొన్ని చనిపోయాయి. చనిపోయిన వాటిని నదిలోనే వదిలేశారు. చింతలమానెపల్లి మండలం దిందా, చిత్తామ గ్రామాల వద్ద ప్రాణహిత నది నీటి వరదలో మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్నారు. కొన్నిసార్లు సంతకు తరలించకుండానే నేరుగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. పోలీసు శాఖ నిఘా పెట్టినా ఆగడాలకు అడ్టుకట్ట పడడం లేదు.
తరలింపు ఇలా..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర కు సరిహద్దుగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడి పశువుల సంతలకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి పశువులను తరలిస్తున్నా రు. కౌటాల పశువుల సంతకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి, ఆళ్లపల్లి, చంద్రపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పశువులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. వాంకిడి మండలం సోనాపూర్కు చంద్రాపూర్ జిల్లా నుంచి ఎక్కువగా పశువులు తరలించి విక్రయిస్తున్నారు. పశువుల వ్యాపారం చేస్తున్న కొందరు ఆదాయం కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చిన్న వాహనాల్లో పదికి పైగా పశువులను బలవంతంగా ఎక్కిస్తున్నారు. పశువుల మూతులు, కాళ్లను తాళ్లతో బంధిస్తున్నారు. ఊపిరాడక పశువులు మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నాయి.
కేసులు నమోదు చేస్తున్నాం
పశువుల అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసుశాఖ నిఘా పెట్టింది. చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముందస్తు సమాచారంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇలాంటి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. ప్రజలు సహకరించి పోలీసులకు సమాచారం అందించాలి. – రాణాప్రతాప్, సీఐ, టాస్క్ఫోర్స్

మూగ వేదన..!