
‘పీఎం జుగా’
గిరిజనుల సంక్షేమ కోసం
ఆసిఫాబాద్అర్బన్: గిరిజనుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన జాతీయ ఉత్రక్ష గ్రామ అభియాన్(పీఎం జుగా)కు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం పీఎం జుగాపై గిరిజన సంక్షేమం, విద్యుత్, వ్యవసాయ, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, సంక్షేమ, పౌర సరఫరాలు, పంచాయతీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన జాతీయ ఉత్రక్ష గ్రామ అభియాన్ కింద ఈ నెల 15 నుంచి 30 వరకు జిల్లాలోని 102 గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నామని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించి రోజువారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రతీ గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయాలన్నారు. మహిళలను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదు చేయించాలన్నారు. విద్యుత్ సరఫరా లేని గ్రామాలు, ఇళ్లను గుర్తించి అర్హులకు కనెక్షన్లు ఇవ్వాలని, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని, పీఎం విశ్వకర్మ పథకం కింద కులవృత్తుల వారిని గుర్తించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. పీఎం జుగా ద్వారా అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, ఈ– డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్, జిల్లా మత్య్సశాఖ అధికారి సాంబశివ్రావు, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతన ఆర్వోఆర్ చట్టంలో భాగంగా భూసమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ పోచయ్య, ఆర్ఐ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే