
తప్పించారా.. తప్పుకున్నారా!
● ‘జిల్లా ఇన్చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ ● హాట్టాపిక్గా సీతక్క మార్పు ● గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు ● అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్ ● తాజాగా ఆమె నిజామాబాద్కు.. అక్కడి నుంచి ‘జూపల్లి’ ఇక్కడికి
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
అటు నుంచి ఇటు.. ఇటునుంచి అటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కొత్త ఇన్చార్జి మంత్రికి సవాలు..
ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతినిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్చార్జీ లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.
వీటిపై ప్రభావం పడేనా..
పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్కు విశ్వప్రసాద్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా, కొత్త ఇన్చార్జి మంత్రి రానుండడంతో వీటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పార్టీలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
సీతక్కకు కలిసిరాని ఎన్నికలు
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంట్, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయిల్ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. తాజాగా అదే జరిగింది.

తప్పించారా.. తప్పుకున్నారా!

తప్పించారా.. తప్పుకున్నారా!