
రైతులకు వెత
సరఫరాలో కోత..
● జిల్లాకు సరిపడా చేరని ఎరువులు ● జూన్, జూలై, ఆగస్టు నెలల కోటా అందని వైనం ● యూరియా, డీఏపీ కోసం అన్నదాతల ఎదురుచూపు ● రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం
సాక్షి, ఆసిఫాబాద్: వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు అవసరం మేరకు యూరియా, ఇతర ఎరువులు సరఫరా లేకపోవడంతో ఎదురుచూపులు తప్పేలాలేవు. జిల్లాలో మార్కెఫెడ్, సహకార సంఘాల వద్ద యూరియా, డీఏపీ నిల్వలు స్వల్పంగా ఉండటమే ఇందుకు కారణం. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది మాదిరిగా ఈ ఏడాది అవసరమైన నిల్వలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారనుంది. మే నెలాఖరు వరకు వచ్చిన నిల్వల్లోనే భారీగా కొరత ఉండటం.. జూన్కు సంబంధించి ఇప్పటివరకు సరఫరా లేకపోవడం.. జూలై, ఆగస్టు నెలల్లో ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది.
సరఫరాలో కోత..
జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 3.35 లక్షల ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి వేయనున్నారు. మరో 30,430 ఎకరాల్లో కంది పంట, ఇతర పంటలన్నీ మరో 22,395 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యూరియా ర్యాక్లు పంపించేది. ప్రస్తుతం సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపిన కేంద్రం యూరియా సరఫరాలో కోత పెడుతోంది. ఫలితంగా నెలవారీ కోటాలో కోత విధిస్తుండటంతో రానున్న మూడు నెలలకు యూరియా, డీఏపీ సరిపడా రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మేలో నిల్వలు పరిశీలిస్తే జూలై నెలలో రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేదు. మే నెలాఖరు వరకు జిల్లాకు 12,121 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే దిగుమతి అయింది. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 20 వేలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలుండగా.. ఈ ఏడాది 12,121 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు జూన్కు మాత్రమే సరిపోనున్నాయి.
రానున్న మూడు నెలల్లో అధిక వినియోగం..
జిల్లాలోని రైతులు యూరియాను జూన్ నెలాఖరు నుంచి మొదలెడితే జూలై, ఆగస్టులో అధికంగా వినియోగిస్తారు. అలాగే వరినాట్లు వేశాక 18– 20 రోజుల అనంతరం యూరియా వాడకం ప్రారంభిస్తారు. సెప్టెంబర్లో కూడా వరినాట్లు కొనసాగుతాయి. ఆ నెలలోనూ అధికంగా యూరియా వినియోగం ఉంటుంది. జూన్లో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎస్ఎస్పీ, ఎన్కేపీఎస్ ఎరువులు మొత్తం 26,210 మెట్రిక్ టన్నులు, జూలైలో 39,316 మె.టన్నులు, ఆగస్టులో 39,310 మె.టన్నులు, సెప్టెంబర్లో మరో 26,210 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయాలని కోరుతూ జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు సమాచారం.
జిల్లాలో ఎరువుల నిల్వలు (మె.టన్నులు)
ఎరువు అవసరం నిల్వలు
యూరియా 60,081 12,121
డీఏపీ 40,054 2,027
ఎంవోపీ 10,013 152
ఎస్ఎస్పీ 20,027 738
ఎన్పీకేఎస్ 20,027 3,501
గతంలోలా సరఫరా లేదు..
యూరియా, ఇతర ఎరువుల సరఫరా విషయంలో గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ప్రతినెలా సరిపడా మాత్రమే పంపిణీ చేస్తోంది. అందువల్ల కొంత కొరత ఉన్నా.. రైతులందరికీ సరిపడా ఎరువులు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాం. ఎరువుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయం.
– రావూరి శ్రీనివాసరావు,
జిల్లా వ్యవసాయ అధికారి