ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి శ్రీసిటీకి చెందిన పయ్యావుల ఉమామహేశ్వరి(17) ఇంట్లో ప్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె తల్లి అనారోగ్యం బారిన పడగా బాధపడుతున్న ఉమామహేశ్వరి చదువులో ఒత్తిడి ఎదుర్కొంటోందని సమాచారం. దీంతో బుధవా రం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకోగా, కొంతసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
ఎలుకల పేస్ట్ తిని వృద్ధురాలు..
మండలంలోని ఎం.వెంకటాయపాలెంకు చెందిన వడ్లమూడి గురవమ్మ(75) ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్య చేసుకుంది. వృద్ధాప్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈనెల 9న ఎలుకల పేస్ట్ తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి గురువారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
వాగులో మునిగి
యువకుడు మృతి
బోనకల్: మండలంలోని ఆళ్లపాడుకు చెందిన ముంగి వెంకట్రావు(20) ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన గురువారం స్నేహితులతో కలిసి కలకోటలోని పెద్దవాగు వద్దకు వెళ్లాడు. అక్కడ ఈతకు దిగగా, ఇటీవల రోడ్డు పనుల కోసం తవ్విన గుంతలో నీరు నిల్వ ఉన్న విషయం తెలియక మునిగిపోయాడు. స్నేహితులు ఆయనను బయటకు తీసి 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గేదెలను కాపాడబోయి రైతు..
తల్లాడ: మండలంలోని కుర్నవలిలో వాగులో పడిన గేదెలను కాపాడే క్రమాన నీట మునిగి ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గొర్రెపాటి పుల్లారావు(33) గేదెలను గురువారం ఉదయం కుర్నవల్లి వాగు సమీపాన మేతకు తీసుకెళ్లాడు. అక్కడ నీళ్ల కోసం గేదెలు వాగులోకి దిగాయి. అవి లోతులోకి వెళ్తుండడంతో కాపాడేందుకు పుల్లారావు వాగులోకి దిగాడు. అక్కడ గుండాన్ని గమనించక ఆయన మునిగిపోయి మృతి చెందాడు. సమీప రైతులు కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. పుల్లారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


