చర్ల: మిర్చికోతలకు వచ్చిన సరిహద్దు ఛత్తీస్గఢ్ వలస కూలీలు తిరుగుపయనమయ్యారు. బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల ఆదివాసీలు ఉపాధి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మిర్చి కోతలకు వలసవచ్చారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మిర్చి కోత పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో తిరిగి వెళ్తున్నారు. దీంతో సరిహద్దు రహదారులు, గ్రామాలు సందడిగా మారాయి. కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. గత ఆదివారం వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర విక్రయాలు భారీగా సాగాయి. మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకుంటుండడంతో ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ గూడేల్లో సందడి నెలకొంటోంది.


