ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా రహిత సమా జ నిర్మాణానికి అంతా కలిసి రావాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు పిలుపునిచ్చారు. వచ్చేనెల 8న ప్రపంచ తలసేమియా దినోత్సవం జరుపుకోనుండగా, నెల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలోని రితన్య ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీఎస్బీ ఏసీపీ టి.మహేష్, సీఏఆర్ ఏసీపీ నరసయ్య, సీసీఎస్ ఏసీపీ సర్వర్, సీఎస్బీ సీఐ రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడు తూ సంకల్ప సంస్థకు అండగా నిలిచేలా చిన్నారులకు అవసరమైన సమయాల్లో రక్తదానం చేస్తామని తెలిపారు. ఆతర్వాత డాక్టర్ డి.నారాయణమూర్తి, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి రవిచందర్ మాట్లాడగా ఏసీపీ టి.మహేష్, సీఐ రాజిరెడ్డి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెండ్
కామేపల్లి: కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బి.నెహ్రూపై సస్పెన్సన్ వేటు పడింది. ఈ మేరకు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడమే కాక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.


