కామేపల్లి: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బీసీ వసతి గృహం భవనాన్ని వినియోగంలోకి తెచ్చేలా చేపట్టిన మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. వసతి గృహంలో పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, పీఆర్ ఏఈ అశోక్, కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు.
టీబీ నియంత్రణ విభాగానికి అవార్డులు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా టీబీ ఆస్పత్రితో పాటు, గంగారం పీహెచ్సీ వైద్యుడికి టీబీ నియంత్రణ విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. టీబీ నివారణ, నియంత్రణ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను అవార్డులు ప్రకటించగా, హైదరాబాద్లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో గంగారం పీహెచ్సీ డాక్టర్ అవినాష్, జిల్లా క్షయ నివారణ అఽధికారి డాక్టర్ సుబ్బారావును సన్మానించారు. అనంతరం డీఎంహెచ్ఓ రామారావు మాట్లాడుతూ నిరంతర కృషితో టీబీ నివారణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన నిలిచిందని తెలిపారు.
నంబర్ ప్లేట్ లేకపోతే చర్యలు
ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్ లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఖమ్మం ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. నంబర్ ప్లేట్ అసలే లేని, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాహనాల గుర్తింపునకు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన నంబర్ ప్లేట్ లేని పలువురి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని వాహనదారులకు రూ.14వేలు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న వారికి రూ.1,700 జరిమానా విధించడమే కాక ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలకు వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు.


