● అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం ట్యాంక్బండ్ వద్ద ఆయన విగ్రహానికి గురువారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, బీసీ సంఘాల నాయకులు కత్తి నెహ్రూ గౌడ్, బచ్చు విజయ్కుమార్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అమరగాని వెంకన్న, వడ్డెబోయిన నరసింహగౌడ్, మార్కం లింగయ్య గౌడ్, ఉడుగు శ్రీనివాసగౌడ్, డాక్టర్ శ్రీనివాసగౌడ్, డాక్టర్ రాజశేఖర్గౌడ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, షేక్ షకీనా తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 4న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్లోని భారత్ ఆటోటెక్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీం లీడర్స్, కంప్యూటర్ అపరేటర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసి, ఎంచుకున్న పోస్టుల్లో కనీసం రెండేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈమేరకు శనివారం ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని, వివరాలకు 70369 02902 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
వైరా ఎంవీఐగా
వెంకటరమణ
వైరా: వైరా సబ్ డివిజన్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)గా వాకదా ని వెంకటరమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఎంవీఐగా విధులు నిర్వర్తించిన వరప్రసాద్ ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. దీంతో 2012 బ్యాచ్కు చెందిన వెంకటరమణ ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తుండగా వైరాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ వాహనదారులు తమ పనుల కోసం నేరుగా కార్యాలయంలో సంప్రదించాలే తప్ప దళారులను నమ్మొద్దని సూచించారు.
వంటావార్పుతో
ఉద్యోగుల నిరసన
ఖమ్మంవ్యవసాయం: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో విద్యుత్ ఉద్యోగులు గురువారం ఖమ్మం సర్కిల్ కార్యాలయం ఎదుట వంటావార్పుతో నిరసన తెలిపారు. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్లర్లు, ఇతర విభాగాల కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరగా, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1104 సంఘం జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శేషగిరిరావు, 327 జిల్లా అధ్యక్షుడు మందపాటి సత్యనారాయణరెడ్డితో పాటు ఎం.ప్రసాద్, ఉపేందర్, ముడిక శ్రీను, వల్లాల యుగంధర్, అన్వర్, ఉపేందర్రెడ్డి, బషీర్, రామకృష్ణ, జానీపాషా, బోడ మంగ్యా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు.
కొనసాగుతున్న
కబడ్డీ టోర్నీ
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో నాలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. వేంకటాచలపతి దేవాలయంలో తిరు కల్యాణం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు గురువారం రెండు తెలుగు రాష్టాలకు చెందిన జట్లు, తమిళనాడుకు చెందిన నిలపురం, కర్ణాటక కుదునూరు జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. పోటీలను తల్లాడ ఏడీఈ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించగా.. మ్యాచ్లు చూసేందుకు కుర్నవల్లి పరిసర గ్రామాల ప్రజలు హాజరయ్యారు.


