తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వేంకటాచలపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తల్లాడ తహసీల్దార్ కరుణాకర్రెడ్డి, అంతర్జాతీయ చెస్ చాంపియన్ శీలం రఘురామిరెడ్డి ప్రారంభించగా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ పరిశీలన
ముదిగొండ: మండలంలోని యడవల్లి, యడవల్లి లక్ష్మీపురంల్లో పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు వేసేందుకు మంగళవారం శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను జిల్లా పశువైద్యాధికారి బి.పురంధర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఈ నెల 10వ తేదీలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ముదిగొండలోని పశువైద్యశాలలో రికార్డులను తనిఖీ చేశారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్, ఉద్యోగులు ఇందిర, బాలాజీసింగ్, కల్పన పాల్గొన్నారు.
ఇబ్బందుల్లో ఉన్నా... ఆదుకోండి!
నేలకొండపల్లి: ‘హలో పంచాయతీ కార్యదర్శియేనా.., నేను ఆర్డబ్ల్యూఎస్ డీఈఈని, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను, కొంత డబ్బు సర్దితే రేపు ఉదయం తిరిగి ఇచ్చేస్తా...’అంటూ పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మాజీ సర్పంచ్లకు ఫోన్ చేసిన వ్యక్తి వసూళ్లకు పాల్పడ్డాడు. మండలంలోని పలువురికి మంగళవారం ఫోన్ చేసిన సదరు వ్యక్తి కొందరికి పేరు విరూపాక్ష అని, మరికొందరికి నాగేశ్వరరావు అని చెప్పుకున్నాడు. ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేశాక ఆరోగ్య పరిస్థితులు బాగా లేనందున రూ.2 వేలు అడగగా, మరికొందరికి ఆలయానికి వెళ్తే పర్స్ చోరీ అయిందని డబ్బు అడిగాడు. దీంతో పలువురు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు పంపించాక ఆ పేరుతో ఎవరూ లేరని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఓంప్రకాష్ను వివరణ కోరగా.. తప్పుడు పేర్లతో గుర్తుతెలియని వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసిందని, ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హెచ్చు పాటదారుడికే సంత బాధ్యత
కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి (పండితాపురం) శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత నిర్వహణ బాధ్యతలను హెచ్చు పాటదారుడికి అప్పగించినట్లు పంచాయతీ కార్యదర్శి శంకర్ తెలిపారు. గత నెల 24న వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన భూక్యా వీరన్న రూ.2.09 కోట్లకు పాడారు. అంతకు ముందు మూడు సార్లు వేలం నిర్వహించినా ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వాయి దా పడింది. చివరకు రూ.2.09 కోట్లకు పాడిన వీరన్నకు సంత ఇచ్చేలా జీపీ పాలకవర్గం తీర్మానించి ఉన్నతాధికారులకు నివేదిక పంపగా వారి ఆదేశాలతో అప్పగించారు. గతేడాది కంటే ఈసారి జీపీకి రూ.33.30 లక్షలు ఆదాయం తగ్గింది.
డీఈఈ పేరిట ఫోన్ చేసి వసూళ్లు


