బియ్యం నిల్వల్లో తేడాతో చర్యలు
చింతకాని: చింతకాని మండలం నాగిలిగొండ రేషన్ డీలర్ చాట్ల శ్రీనుపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి చందన్కుమార్ తెలిపారు. రేషన్ దుకాణాన్ని ఆయన గురువారం తనిఖీ చేయగా 112.61 క్వింటాళ్లకు బదులు 52.50 క్వింటాళ్ల బియ్యం ఉండడం, 60.11 క్వింటాళ్ల నిల్వ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో డీలర్పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు రిజిస్టర్లలో అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా అక్రమాలకు పాల్పడినా కేసులు తప్పవని హెచ్చరించారు.
‘భూదాన్’ పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో అమాయకులను మోసగించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. నిందితులు ముఠాగా ఏర్పడి తాము ఓపీడీఆర్కు చెందిన వారమని, భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ భూదాన్ భూముల్లో గృహ స్థలాలు ఇప్పిస్తామని పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేశారని వెల్లడించారు. అంతేకాక భూదాన్, ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటిని చూపిస్తూ ప్రజలను మోసం చేశారని తెలిపారు. ఈమేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.


