అసలే హాని.. ఆపై కల్తీ
● జిల్లాలో జోరుగా నకిలీ సిగరెట్ల విక్రయాలు ● రూ.లక్షల్లో ఆర్జిస్తున్న ముఠా
సత్తుపల్లి: ‘ధూమపానం ఆరోగ్యానికి హానీకరం’ అని సిగరెట్పై పెట్టెలపై ఫొటోలతో సహా ముద్రించి ఉంటుంది. అయినా అలవాటు పడిన వారు మానేయలేక కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారి బలహీనతను ఆసరా చేసుకున్న కొందరు నకిలీ సిగరెట్లను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసలైన సిగరెట్ల కంటే నకిలీలే ఎక్కువగా అమ్ముతున్నారని తెలుస్తోంది. సిగరెట్లతో ఆరోగ్యానికి హానీ ఎదురవుతుండగా, నకిలీ సిగరెట్లతో మరింత ముప్పు పొంచి ఉన్నట్లేనని పలువురు హెచ్చరిస్తున్నారు.
సత్తుపల్లిలో డూప్లి‘కేటు’
సత్తుపల్లి మార్కెట్లో పలు మాఫియాలకు కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తి కనుసన్నల్లో రూ.లక్షల విలువైన స్మగ్లింగ్ సిగరెట్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి జిల్లాకు ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండే నకిలీ సిగరెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. ఇది రిటైల్ వ్యాపారులకు తెలిసే జరుగుతోందని చెబుతున్నారు. బ్రాండ్ సిగరెట్లతో పోలిస్తే నకిలీలు అమ్మితే లాభాలు ఎక్కువగా వస్తుండడంతో రిటైల్ వ్యాపారులు ఇటే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఒక్కో సిగరేట్ ప్యాకెట్కు రూ.20 నుంచి రూ.30 వరకు కమీషన్ వస్తున్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో కంటే పల్లెల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోందని తెలిసింది.
ధరల పెంపు ప్రచారంతో...
ఐటీసీ కంపెనీ సిగరెట్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. అయితే, ఇటీవల ధరల పెంపు ప్రచారంతో కొత్త స్టాక్ రాలేదంటూ హోల్సేల్ వ్యాపారులు గిరాకీకి సరిపడా రిటైల్ వ్యాపారులకు ఇవ్వడం లేదని సమాచారం. దీంతో పలువురు నకిలీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇది బహిరంగంగానే జరుగుతున్నా కట్టడి చేయాల్సిన అధికారులకు ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. కాగా, సిగరెట్ పెట్టైపె ఉన్న బార్కోడ్ను స్కాన్ చేస్తే అసలా, నకిలీనా అని గుర్తించొచ్చని ఐటీసీ బాధ్యులు చెబుతున్నారు. అంతేకాక సిగరెట్లపై గుర్తుల ముద్రణలోనూ తేడా ఉంటుందని తెలుస్తోంది.


