● ముస్తాబైన కూసుమంచి శివాలయం
కూసుమంచి: కూసుమంచిలోని శివాలయం(గణపేశ్వరాలయం) మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనుండగా శనివారం రాత్రి ధ్వజారోహణ, అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ఆదివారం వేలాదిగా హాజరయ్యే భక్తులు సాఫీగా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లలో ఆలయ కమిటీ నిమగ్నమైంది. కాగా, కూసుమంచిలో ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలనలో గణపతి రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని శివలింగం ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదిగా ఘనతికెక్కింది. ఒకప్పుడు జీర్ణావస్థకు చేరిన ఆలయానికి కొన్నేళ్లుగా భక్తుల రాక పెరిగింది. ఆలయ అభివృద్ధికి ఇటీవలె ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించడం మరో విశేషం.


