ఉత్సాహంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం సమ్మేళనం నిర్వహించారు. 40 ఏళ్ల అనంతరం కలుసుకున్న ఆనాటి విద్యార్థులు పాత జ్ఞాపకాలు, అప్పుడు వ్యవహరించిన తీరును గుర్తుచేసుకున్నారు. ఒకరికొకరు యోగ క్షేమాలు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్, కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ జీవీఆర్ లక్ష్మణ్రావు, భూపాలపల్లి డీఆర్ఆర్ఓ శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నల్లమల గిరిప్రసాద్ సతీమణి మృతి
మధిర: స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఐ మాజీ జాతీయ సహాయ కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) శనివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. మధిర మండలం తొండలగోపవరం గ్రామానికి చెందిన నల్లమల గిరిప్రసాద్ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాగా, కమలాదేవి మృతిపై సీపీఐ నాయకుడు బెజవాడ రవిబాబు తదితరులు సంతాపం ప్రకటించారు.
రెప్పపాటులో తప్పించుకున్న దొంగలు!
నేలకొండపల్లి: ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఠా సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని గువ్వలగూడెంలో వారం వ్యవధిలోని మూడు చోట్ల చోరీ జరిగింది. ఈనేపథ్యాన శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో సిబ్బంది అనుమానంతో వచ్చారు. ఈక్రమాన ట్రాన్స్ఫార్మర్ వద్ద అలికిడి వినిపించగా సర్పంచ్కు సమాచారం ఇవ్వడంతో రైతులతో కలిసి చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దుండగులు బైక్ వదిలేసి పారిపోయారు. పోలీసులు వచ్చి బైక్ స్వాధీనం చేసుకుని నంబర్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
ఉత్సాహంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం


