కౌంట్.. డౌన్!
మున్సిపాలిటీల వారీగా వార్డులు, టేబుళ్లు
పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం
నేడు మున్సిపాలిటీల ఫలితాలు
● ఐదు చోట్ల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ● ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభం ● కేంద్రాల పరిధిలో పోలీసు ఆంక్షల అమలు
పక్కాగా ఏర్పాట్లు..
ఏదులాపురం మున్సిపాలిటీ ఓట్లను పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో, కల్లూరు మున్సిపాలిటీ ఓట్లను ప్రభుత్వ హైస్కూల్లో, మధిర మున్సిపాలిటీ ఓట్లను ఖాజీపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కించనున్నారు. అలాగే, వైరా మున్సిపాలిటీ ఓట్లను వెటర్నరీ హాస్పిటల్లో, సత్తుపల్లి మున్సిపాలిటీ ఓట్లను జ్యోతి నిలయంలో లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్బాక్స్లను భద్రపరచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద భారీ భద్రత కల్పించగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు, అభ్యర్థులు, ఏజెంట్లకు సౌకర్యాలు సమకూర్చారు.
ప్రతీచోట రెండేసి రౌండ్లు
ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 59టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు మరొకరు సహాయకులుగా ఉంటారు. వీరికి అదనంగా 18మంది సూపర్వైజర్లు, 38 మంది సహాయకులు విధులు నిర్వర్తించనున్నారు. ఏదులాపురంలో 32 వార్డులకు గాను 16 టేబుళ్లు ఏర్పాటుచేసినా, 15వ వార్డు ఏకగ్రీవం కావడంతో ఒక టేబుల్పై రెండో రౌండ్ లెక్కింపు ఉండదు. ఒక్కో టేబుల్పై తొలి రౌండ్లో ఒక వార్డు, ఆతర్వాత మరో వార్డు అంటే ప్రతీ టేబుల్పై రెండేసి వార్డుల లెక్కింపు ఉంటుంది. ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండేసి రౌండ్లలో అన్ని వార్డుల ఫలితం వెలువడుతుంది.
లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు
మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. కేంద్రాల వద్ద కర్రలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో తిరగడంనిషేధమని, మైక్లతో ప్రసంగాలు, ఫొటోలు, గుర్తులు ప్రదర్శించొద్దని తెలిపారు. అంతేకాక సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి లేదని, బహిరంగ ప్రదేశాల్లో విజయోత్సవ ర్యాలీలపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలో వైన్స్, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లను మూసివేయాలని సీపీ ఆదేశించారు.
మున్సిపాలిటీ వార్డులు టేబుళ్లు
ఏదులాపురం 31 16
సత్తుపల్లి 23 12
మధిర 22 11
వైరా 20 10
కల్లూరు 20 10
మొత్తం 116 59
మొదటగా స్ట్రాంగ్రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లను భద్రత నడుమ కేంద్రంలోకి తీసుకొస్తారు. ఏజెంట్ల సమక్షాన సీల్ తెరిచాక తొలుత పోస్టల్ బ్యాలెట్లను వేరు చేస్తారు. ఆపై 8గంటలకు పోస్టల్ బ్యాలెట్లనే మొదట లెక్కిస్తారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సాధారణ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గంటకు పైగా సమయం పడుతుందని అంచనా. ఒక్కో వార్డుకు వేయి నుంచి 2వేల లోపు ఓట్లు ఉండగా... అన్ని మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 12గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశముంది.
కౌంట్.. డౌన్!


