ఎనిమిది క్వింటాళ్ల మిర్చి చోరీ
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల రైతులు కల్లాలో ఆరబెట్టిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. ఇటీవల రెండు ఘటనలు చోటుచేసుకోగా సోమవారం అర్ధరాత్రి చిమ్మపూడిలో గ్రామానికి చెందిన రైతు జానేబోయిన పాపయ్య కల్లం నుంచి ఎనిమిది క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. ఈ మిర్చి విలువ సుమారు రూ.1.60 లక్షలు కాగా ఘటనపైరఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు.
అనారోగ్య కారణాలతో ఆత్మహత్య
కామేపల్లి: మండలంలోని పింజరమడుగుకు చెందిన మల్లెంపాటి రంగయ్య(70) మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఆయన ఇంటి సమీపాన ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమారైలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
మనస్తాపంతో వ్యక్తి..
ఏన్కూరు: భార్యతో పాటు బంధువులు దాడి చేశారనే మనస్థాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఏన్కూరు జంగాల బజార్లో నివాసముండే సగ్గుర్తి రాజశేఖర్(40) మంగళవారం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య వాణి, బావమరిది వంశీతో పాటు దమయంతి, కమలమ్మ, సాయిబాబు తన కొడుకును కొట్టడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని రాజశేఖర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు.


