తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై బ్లూవిల్లాస్ సముదాయంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్లభనేని వెంకన్నబాబు ఐదు నెలల క్రితం అమెరికాలో ఉన్న తన పిల్లల వద్దకు వెళ్లాడు. ఈ విషయాన్ని గుర్తించిన నలుగురు దుండగులు సోమవారం తెల్లవారుజామున ముసుగులు ధరించి వచ్చి తాళం పగలగొట్టి లోనకు ప్రవేశించారు. ఆపై బీరువాలో దాచిన 12 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఆభరణాలను అపహరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వెంకన్నబాబు విద్యుత్ బిల్లు చూడమంటూ తన మిత్రుడు తన్నీరు రామును పంపించగా మంగళవారం ఉదయం వెళ్లేసరికి తాళం పగలగొట్టి ఉండడం, చోరీ ఆనవాళ్లు కనిపించడంతో విషయం బయటపడింది. అంతేకాక దుండగులు సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఘటనపై రాము ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ముసుగు ధరించిన నలుగురు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
బంగారం, వెండి ఆభరణాల అపహరణ


