●పకడ్బందీగా బందోబస్తు
ఖమ్మంక్రైం/ఖమ్మం రూరల్/వైరా: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాటుచేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులతో మంగళవారం ఖమ్మంలోని సీపీ కార్యాలయంతో పాటు రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలకు 1,100మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియమావళిని ఎవరూ ఉల్లంఘించకుండా చూడడమే కాక అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. కాగా, వైరాలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సీపీ సునీల్దత్ పరిశీలించారు. విధులకు వెళ్తున్న పోలీసులకు బందోబస్తుపై సూచనలు చేశారు. ప్రలోభాలకు గురి చేసే వారిపై నిఘా వేసి, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం వైరా పోలీస్స్టేషన్లో అధికారులతో సమావేశమైన సీపీ.. రౌడీ షీటర్ల కట్టడి, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యతక, కేసుల విచారణపై సూచనలు చేశారు.
పోలీసు కమిషనర్ సునీల్దత్


