ఏమేం కావాలి ?!
చివరి రోజు జోరు
గెలుపే లక్ష్యంగా ప్రలోభాల పర్వం నగదు, మద్యం, బహుమతుల పంపిణీకి రంగం సిద్ధం కీలక డివిజన్, వార్డుల్లో పోటాపోటీ చివరిరోజు చుట్టేసిన ప్రధాన పార్టీల నేతలు
మైక్లు కట్..
చివరిరోజైన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా వార్డులను చుట్టేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా అన్ని ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు ముఖ్యనేతలతో కలిసి రోడ్షోలు నిర్వహించడమే కాక ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దాదాపు వారం పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగియడంతో కార్పొరేషన్, మున్సిపాలిటీలు స్తబ్దుగా మారాయి.
వ్యూహాలకు పదును
ప్రచారం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సమావేశమై మున్సిపాలిటీల్లో అత్యధిక ఓట్లు సాధించేలా అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. అలాగే, పోలింగ్ ఏజెంట్ల నియామ కం, పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ స్టేషన్ల వద్ద వ్యవహరించాల్సిన తీరుపైనా సమీక్షించారు. అంతేకాక రాత్రివేళ సన్నిహితులను వెంట పెట్టుకుని ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు డివిజన్లు, వార్డుల్లో కీలకంగా ఉన్న నేతల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకునేలా తమవంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు.
అక్కడ.. ప్రత్యేక దృష్టి
బహిరంగ ప్రచారానికి తెరపడడం.. పోలింగ్కు ఒకే రోజు గడువు ఉండడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నుంచే చాలాచోట్ల ప్రలోభాలకు తెరతీశారు. ప్రధానంగా మేయర్, చైర్పర్సన్లకు రిజర్వ్ అయిన డివిజన్లు, వార్డులపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. అభ్యర్థుల విజయానికి నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈనేపథ్యాన ఓటర్లకు ఎంత ముట్టచెప్పడానికై నా వెనుకాడడం లేదు. డిమాండ్ ఆధారంగా ఓటరుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మద్యం కూడా అదే స్థాయిలో పంపిణీ చేసేలా పార్టీలు ఏర్పాట్లు చేశాయి. కొత్తగూడెం కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే మద్యం పంపిణీ మొదలు కాగా, ఓటర్లు డబ్బుతోపాటు ఇతర బహుమతులు కోరినా కాదనకుండా ఇచ్చేలా సిద్ధమయ్యారు. ఏదైనా ఇస్తాం కానీ ఓటు మాత్రం తమకే వేయాలని మాట తీసుకుంటున్నట్లు సమాచారం.
ఓట్లు రాబట్టుకునేందుకు ఉన్న చివరి అవకాశాన్ని వినియోగించుకునేలా సోమవారం ప్రధాన పార్టీల్లోని ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రచారం చేయగా, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధితో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టారు. మధిరలో బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పాల్వంచలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు రోడ్డు షోల్లో పాల్గొన్నారు.
అభ్యర్థుల తెరచాటు మంతనాలు
ఏమేం కావాలి ?!


