అభివృద్ధి బాధ్యత నాదే..
● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ● ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్/కొత్తగూడెంఅర్బన్: ఏదులాపురంలో కాంగ్రెస్, కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఏదులాపురం మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలు, కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్నర్ మీటింగ్ల్లో ఆయన మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో కారుకూతలు కూసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని.. దందాలు, దౌర్జన్యాలు చేసే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రానున్న ఏప్రిల్లో రెండో విడత ఇళ్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని తెలిపారు. మున్నేటి ముంపు ఎదురుకాకుండా వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా, సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో స్థలాల క్రమబద్ధీకరణ సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్లు, డ్రెయినేజీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్పై తొలి సారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే బాధ్యత కూడా తనదేనని పొంగులేటి ప్రకటించారు.


